Sankranti | పల్లెకు పండుగ..!

Sankranti | పల్లెకు పండుగ..!
- సంక్రాంతి సందడి షురూ..
- గ్రామాలకు చేరుకున్ననగరం
- ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు
Sankranti | కుంటాల, ఆంధ్రప్రభ : పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. తెల్లవారు జాము నుండే హరిదాసుల ఇళ్లలోగిల్లకు చేరి ఆట పాటలతో అలరిస్తూ బిక్షాటన చేస్తుండగా గంగిరెద్దులు వాకిల్లలోని రంగవల్లులపై చేరి ఆటలాడుతూ అలరిస్తున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా పల్లెలకు బయల్దేరారు. కొత్తగా పెళ్లయిన కూతుర్లు అల్లుల్లు ఇళ్లకు చేరుకోవడంతో ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి మొదలైంది.
Sankranti | పిండి వంటల ఘుమఘుమలు
సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెటూరులోని ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి చక్నాల తోపాటు అప్పాలు తదితర వివిధ పిండి పదార్థాలు మహిళలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.
Sankranti | పాఠశాలల్లో ముందస్తు ముగ్గుల పోటీలు
ముందస్తు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముత్యాల ముగ్గులు, హరిదాసుల వేషధారణ తోపాటు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సైతం సెలవులు రావడంతో రెండు మూడు రోజుల్లో ముందుగానే సంక్రాంతి శోభ నెలకొంది. చిన్నారులు ముత్యాల ముగ్గులు వేసి అలరించారు.
Sankranti | భోగి మంటలు
భోగి నుంచి ప్రారంభమయ్యే సంక్రాంతి పండుగను కనుమ వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు అందంగా వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
Sankranti | భోగిపండ్ల బొమ్మల కొలువు
భోగి రోజున చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. శనగలు, రేగు పండ్లు, పూలు, నాణ్యాలు కలిపి పోస్తారు. ఈ కాలంలో దొరికే రేగు పండ్లు పిల్లల తలపై పోస్తే ఆరోగ్యంతోపాటు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందుతాయని భావిస్తారు. సాయంత్రం బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. రకరకాల దేవతా మూర్తుల బొమ్మలను అమరుస్తారు. ముత్తైదువులకు నోములు ఇవ్వడం అంటే ప్రత్యేకంగా గౌరీ మాతను పూజించడంగా భావిస్తారు. దేవేంద్రుడు మూడు కాలాలు వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తారు.

Sankranti | చలి మంటలు… పరమార్థం ఇదే..
భోగి పండుగ ప్రధానం ప్రయోజనం ఆరోగ్యం సిద్ధి. తెల్లవారుజామున చలిమంటలు వేసుకుంటారు. పిడకలు, పాత చీపురులు, చాటలను మంటల్లో వేస్తే అరిష్టాలు తొలగుతాయని నమ్మకం. అలాగే ఔషధ వృక్షాలను రావి, మామిడి, వేప, చింత చెట్టు, కలపను మంటల్లో వేస్తారు. ఇవి కాలి వెలువడే గాలిని పీలిస్తే రోగాలు రాకుండా ఉంటాయని, అగ్ని, వాయువులను పూజించినట్లు అవుతుందని ప్రతీతి.
