నాగిరెడ్డిపేట, (ఆంధ్రప్రభ): నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్ రోడ్డుపై వరుసగా మూడురోజులుగా దాన్యం లోడుతో వెళ్తున్న లారీలు దిగబడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఆదివారం రాత్రి దాన్యం కొనుగోలు కేంద్రం నుండి బస్తాలు నింపుకొని రైస్ మిల్కు బయలుదేరిన లారీ ఆత్మకూర్ బీటీ రోడ్డుపై దిగబడి పోయింది. ఇదే ప్రాంతంలో శుక్రవారం, శనివారం రోజుల్లో కూడా రెండు లారీలు ఇలాగే దిగబడిపోయాయి.
జేసీబీ సహాయంతో మట్టిని నింపి ఆ లారీని రైస్ మిల్కు తరలించినట్లు సమాచారం. కాగా, ఆదివారం రాత్రి మరోసారి లారీ దిగబడిపోవడంతో మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి స్వయంగా అక్కడికి చేరుకుని లారీని బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే, సమయానికి జేసీబీ లభించకపోవడంతో లారీ అక్కడికక్కడే ఆగిపోయింది.

