- వీర జవాన్ కు ఏపీ డిప్యూటీ సీఎం భరోసా
- వ్యక్తిగతంగా మరో రూ.25 లక్షలు సహాయం
- మురళీ నాయక్ స్మారక సింహం ఏర్పాటుకు నిర్ణయం
- జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఆదేశం
- మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలం
- 300 గజాల ఇంటి స్థలం
- మురళీ కుటుంబానికి ఉద్యోగ అవకాశం
శ్రీ సత్యసాయి బ్యూరో, మే 11 (ఆంధ్రప్రభ) : దేశ సరిహద్దులో వీరమరణం పొందిన అగ్ని వీరుడు జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ భరోసా ఇచ్చారు. ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని కల్లితండాకు విచ్చేసి, వీరమరణం పొందిన మురళి నాయక్ పార్థీవదేహానికి పుష్పగుచ్చంతో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్ లను పరామర్శించి ఓదార్చారు.
ఈసందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మురళి నాయక్ వీరమరణం నేటి యువతకు ఆదర్శంగా ఉందన్నారు. పాతికేళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలర్పించి, భారత ప్రజల హృదయాలను గెలుచుకున్న నిజమైన హీరోగా మురళీ నాయక్ నిలిచిపోవడం ఖాయమన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలవడం కోసం కూటమి ప్రభుత్వం తరపున రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ అవకాశం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా తాను మరో 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
గుండె తరుక్కుపోయింది…
మురళి మరణం అతి దారుణం. అగ్ని వీర జవాన్ మురళి నాయక్ మరణం దారుణంగా జరిగిందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ మురళి నాయక్ పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నప్పుడు మురళి తలకు బట్టకట్టబడి ఉందని, ఇదేమిటని పూర్తిగా గమనించగా, సగం తల తొలగిపోయి ఉందన్నారు. మరీ ఇంత దారుణంగా చంపారా ? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మురళి తలను చూడగానే ఒక సారిగా గుండె తరుక్కుపోయిందన్నారు.