గౌహతి: రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 ను బోణీ కొట్టింది. ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్లో గెలుపొందిన రాజస్థాన్.. టోర్నమెంట్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్ లో 183 పరుగుల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన సీఎస్కే ని 176 పరుగులకు పరిమితం చేసి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్లో రాయల్స్కు ఇది తొలి విజయం కాగా.. సీఎస్కేకు రెండో ఓటమి.
183 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకు ఆదిలోనే ప్రత్యర్థి పేసర్ జోఫ్రా ఆర్చర్ వణికించాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ రచిన్ రవీంద్ర (0)ను డకౌట్ చేసి ఈ ఓవర్ మెడిన్ చేశాడు. 2025 ఐపీఎల్ లో మెయిడిన్ వికెట్ తీసిన తొలి బౌలర్ గి ఆర్చర్ నిలిచాడు.
ఈ రన్ ఛేజ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (63) అద్భుత బ్యాటింగ్తో సీఎస్కేను ఆదుకున్నాడు. రాహుల్ త్రిపాఠి (23)తో కీలిసి రెండో వికెట్కు 45 పరుగులు జోడించాడు. శివం దూబే (18)తో కలిసి మూడో వికెట్కు 26 పరుగులు జత చేశాడు. ఈ క్రమంలోనే గైక్వాడ్ 37 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో ధోనీ (16) ఔటవ్వగా.. జడేజా (32), జామీ ఓవర్టన్ (11) అజేయంగా నిలిచినా చెన్నైను గెలిపించలేక పోయారు.
నితిష్ రాణా విధ్వంసం..
అంతకుముందు, మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు కెప్టెన్ రియాన్ పరాగ్ (37), సంజూ శాంసన్ (26), హెట్మాయర్ (19) రాణించడంతో రాయల్స్ భారీ స్కోరు నమోదు చేసింది.
చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, పతీరణ, ఖలీల్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, జడేజా చెరొక్క వికెట్ దక్కించుకున్నారు.