ఆంధ్రప్రభ ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కు చెందిన ప్రముఖ సివిల్ ఏ-1 కాంట్రాక్టర్ గుట్ట ప్రవీణ్ (47) గుండెపోటుతో మరణించారు. గుట్ట ప్రవీణ్ గత ఆరు నెలలుగా హైదరాబాదులోని కొంపల్లి లో నివాసం ఉంటున్నాడు. రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పితో గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శుక్రవారం ఉదయం ప్రవీణ్ భౌతికకాయాన్ని ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కు తరలించగా కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ గుట్ట హనుమాన్లు కుమారుడైన గుట్ట ప్రవీణ్ పిన్నవయసులోనే కాంట్రాక్టర్ గా రాణించి ఉమ్మడి జిల్లాలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రముఖుల సంతాపం..
గుట్ట ప్రవీణ్ మృతి చెందార న్న వార్త ఆదిలాబాద్ పట్టణంలో విషాదం నింపింది. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న వివిధ పార్టీల నాయకులు, బీసీ, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు హాజరై నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు ఆదిలాబాద్ లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
RIP | సివిల్ కాంట్రాక్టర్ గుట్ట ప్రవీణ్ గుండెపోటుతో మృతి.. ఎంపి, ఎమ్మెల్యే సంతాపం
