హైదరాబాద్: తెలంగాణ రైజింగ్-2047పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకు అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అభివృద్ధి, పురోగతిపై అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.
ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు అధికారులు. ఫేజ్-1లో 25, ఫేజ్-2లో 40, ఫేజ్-3లో 46 ఏటీసీలని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఫేజ్-1, ఫేజ్-2లో ఇప్పటి వరకు 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు అధికారులు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్రెడ్డి. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సూచించారు. అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
గిగ్ వర్కర్స్ పాలసీపై సమీక్ష
గిగ్ వర్కర్స్ పాలసీపై సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. గిగ్ కార్మికులకు ప్రతిపాదిత పాలసీని సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. గిగ్ వర్కర్స్కు చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించారు అధికారులు. సంక్షేమబోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదనలు చేశారు. గిగ్ కార్మికుల పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్రెడ్డి. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి. సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్స్రెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.