Revanth Reddy | ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది

Revanth Reddy | ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy | హైదరాబాద్, ఆంధప్రభ : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ప్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉందని అన్నారు.
2009లో ఇదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మొదలు పెట్టేందుకే విగ్రహాలు ఆవిష్కరించామని చెప్పారు. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదినం డిసెంబరు 9న కావడం తమ అందరికీ సంతోషాన్ని కలిగించే పర్వదినమని అన్నారు. ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
