- సింగపూర్ ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
- తెలంగాణతో ఆర్థిక సంబంధాల బలోపేతంపై ఆసక్తి: కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్
హైదరాబాద్ : గ్రీన్ పవర్, రీజనల్ రింగ్ రోడ్డు, మూసి పునర్జీవం, విద్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ కాన్సల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ మాట్లాడుతూ… తెలంగాణతో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, డిప్యూటీ సీఎం సహకారం, సందేశం కావాలంటూ పాంగ్ కోరారు.
గ్రీన్ ఎనర్జీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసి పునర్జీవనం, విద్య తమ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలని ఈ రంగాల్లో సింగపూర్ సంస్థలతో కలిసి పని చేసే అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్త గ్రీన్ పవర్ పాలసీలో భాగంగా సోలార్, హైడ్రో, పంపుడ్ స్టోరేజీ విభాగాలపై దృష్టి పెట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు సింగపూర్ ప్రతినిధి బృందానికి వివరించారు. ప్రతి పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాము ఇది రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు అని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం, అత్యధికంగా పట్టణాలున్నాయని పట్టణ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలిపారు. సమావేశంలో సింగపూర్ పొలిటికల్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్, సింగపూర్ హై కమిషన్ ప్రధమ ఆర్థిక సెక్రటరీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.