MDK | రాహుల్ గాంధీ ది క్షమించే గుణం… జగ్గారెడ్డి

మోడీ, అమిత్ షాది కుట్ర గుణం


సంగారెడ్డి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ) : భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో రాహుల్ గాంధీ కుటుంబీకులు ఎనలేని ఉద్యమాలు చేశారని, నేటికీ రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జి షీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈసందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి ఉన్న క్షమించే గుణం ఎవరికీ లేదని, మోడీ, అమిత్ షాలది కుట్ర గుణమని మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రి చేయలేదని ఆర్ఎస్ఎస్ నాయకులను నాయకులను ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కానీ తమ నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీలు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసిన ఘనత వారికి దక్కిందన్నారు.

ఈ చర్యలతో బీజేపీ నాయకుల వైఖరి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా తెలుస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు తాను ఒకటే సమాధానం చెబుతున్నానని, రాహుల్ గాంధీ ముత్తాత మోతీ లాల్ నెహ్రూ ఇంటి దర్వాజాలు, కిటికీలు, స్తంభాల విలువ చేయవు మీరు చేసిన అవినీతి ఆరోపణలు అని అన్నారు.

నేషనల్ హెరాల్డ్ పెట్టినప్పుడు మోడీ, అమిత్ షాలు అప్పటికి పుట్టలేదని, స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఏమిటని ప్రశ్నించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో పోరాట పటిమను ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పేపరే నేషనల్ హెరాల్డ్ అని గుర్తు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు అనంత కిషన్, జార్జ్, ఆంజనేయులు, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *