జన్నారం రూరల్, మే 8 (ఆంధ్రప్రభ): ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగులో రూ.20లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ )ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. పేదల ఆరోగ్యం కోసం మరిన్ని పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం సరఫరా చేసే మందులను క్షుణ్ణంగా పరిశీలించి, రోగులకు అందజేయాలని, కాలం చెల్లిన మందులు రోగులకు ఇచ్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమున్న పనులను చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అధికారులు కూడా ఆ దిశగా ప్రజల అవసరాల నిమిత్తం ముఖ్యమైన అభివృద్ధి పనుల వివరాలతో తనకు ప్రతిపాదనలు పంపించాలని ఆయన తెలిపారు.
నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించకూడదని, నాసిరకం పనులు చేసినట్లయితే సహించబోనని ఆయన చెప్పారు. పేదల అభివృద్ధియే ధ్యేయంగా తాను పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్, ఏఏఎం ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిల్ కుమార్, స్థానిక మెడికల్ ఆఫీసర్ గోల్కొండ ఉమాశ్రీ, స్థానిక పల్లె దవాఖాన వైద్యురాలు గంగాదేవి, ఎంపీడీవో హుమర్ షరీఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్లు దుర్గం లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల, గ్రామ కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్, పార్టీ సీనియర్ నేతలు జి.మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, కలమడుగు గ్రామ నేతలు సాగర్ గౌడ్, బండ శ్రీకాంత్, శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.