Press conference | పని తీరు మారలేదు..

Press conference | నల్గొండ, ఆంధ్రప్రభ : రేవంత్ రెడ్డి పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతూ… రాత్రి మోడీ చంద్రబాబులతో చీకటి ఒప్పందాలు చేస్తున్నాడని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మారలేదు, భాష మారలేదు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటినుండి సామాన్య ప్రజలే కాదు ఆ పార్టీ నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
మొదటి నుండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి తీరుతో విసుగు చెందిపోయారు. పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి రాత్రి మోడీ చంద్రబాబు లతో చీకటి ఒప్పందాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆగడాలను,తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎక్కడిక్కడా బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది. ప్రజాక్షేత్రంలో అరాచక కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు చుక్కలు చూపిస్తున్నారు.
బొగ్గు కుంభకోణం, కాంగ్రెస్ పార్టీ స్కాంలను ఎండగట్టినందుకే హరీష్ రావుపై అక్రమ కేసు బనాయించింది. కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే హరీశ్ రావు గారికి రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా సిగ్గులేని రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ విచారణ అంటూ హరీష్ రావు గారిని ఇబ్బందులు పెడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది.ఎలక్షన్స్ వస్తేనే కెసిఆర్ గారిపై కాళేశ్వరం కేసు, కెటిఆర్ పై ఫార్ములా ఈ రేసు కేసు, హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటూ వేధింపులు చేస్తోంది.
హరీష్ రావు మాట్లాడిన విషయంలో ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఇన్నిసార్లు నల్లగొండ జిల్లాకు వచ్చిన ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి. అధికారం, ధనం, పోలీసు యంత్రాంగంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతుంది. సీనియర్ కాంగ్రెస్ మంత్రులందరి ఫోన్ లు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నాడు. అధికారులు పై స్థాయి నుండి కిందిస్థాయి వరకు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలానే వ్యవహరిస్తున్నారు.
పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడిస్తోంది. కోదాడలో దళితబిడ్డ కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారకులయ్యారు. ప్రశ్నించే గొంతుకులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణగదొక్కుతుంది. రాజేష్ మృతికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నకిరేకల్ లో స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక, మట్టి రవాణా యదేచ్ఛగా చేస్తున్నాడు. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనీ పాతాళంలో కలిపి మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీనీ తీసుకురావడం ఖాయం అని తెలిపారు.
