15వ తేదిన సైప్రెస్ కు.. 16వ తేదిన కెనడాకు
18వ తేదిన క్రొయేషియాలో పర్యటన
షెడ్యూల్ విడుదల చేసిన ప్రధాని కార్యాలయం
న్యూ ఢిల్లీ – పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor ) తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ (PM Modi ) విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు (G 7 Summit ) ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.
కెనడాతో పాటు ప్రధాని మోడీ సైప్రస్, క్రొయేషియా దేశాల్లో కూడా పర్యటిస్తారు. ఈ నెల 16-17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో, ఇంధన భద్రత, సాంకేతికత మరియు ఆవిష్కరణలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై భారతదేశం యొక్క వైఖరిని ప్రధాన మంత్రి భారత వైఖరి తెలియచేస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 16 వరకు మోడీ సైప్రస్ పర్యటనలో ఉంటారు. ఆ తర్వాత 16-17 వరకు జీ-7 సమావేశంలో పాల్గొంటారు. దీని తర్వాత జూన్ 18న క్రొయేషియాలో పర్యటిస్తారు.