న్యూఢిల్లీ – పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని.. ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని.. దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్కు అండగా నిలిచిందని.. పహల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భారోసా ఇచ్చారు.
ఈ ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని నాకు తెలుసు. పహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, వారి పిరికితనాన్ని చూపిస్తుంది. ఉగ్రవాదులు, దాని వెనుక ఉన్నవారు కశ్మీర్ మళ్ళీ నాశనం కావాలని కోరుకుంటున్నారు. అందుకే వారు ఇంత పెద్ద కుట్ర చేశారు. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ యుద్ధంలో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం మనకు అతిపెద్ద బలం. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉందని ప్రధాని అన్నారు.
అతను ఏ రాష్ట్రానికి చెందినవాడైనా, ఏ భాష మాట్లాడినా, ఈ దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను అంతా అనుభవిస్తున్నాడు. కశ్మీర్లో శాంతి తిరిగి వస్తున్న సమయంలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్సాహం నెలకొంది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి, ప్రజాస్వామ్యం బలపడుతోంది, పర్యాటకుల సంఖ్యలో రికార్డు పెరుగుదల ఉంది, ప్రజల ఆదాయం పెరుగుతోంది, యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి విషయాలు దేశ శత్రువులు, జమ్మూ కశ్మీర్ శత్రువులకు నచ్చలేదు.
ఈ ఉగ్ర దాడి తర్వాత దేశం మొత్తం ఒకే గొంతులో మాట్లాడుతుంది ప్రధాని అన్నారు. భారతదేశ ప్రజల్లో ఉన్న కోపం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ ఉగ్రవాద దాడి తరువాత, ప్రపంచం నలుమూలల నుండి సంతాప సందేశాలు నిరంతరం వస్తున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు, లేఖలు రాశారు. ఈ హేయమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మరోసారి హామీ ఇస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులకు, కుట్రదారులకు కఠినంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఉగ్రవాద నాయకులు కశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఈ సవాలును ధీటుగా ఎదుర్కోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాం.” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
అనంతరం.. ఇస్రో మాజీ చీఫ్, శాస్త్రవేత్త కె. కస్తూరిరంగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కస్తూరిరంగన్ తన జీవితాంతం నిస్వార్థంగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమని స్పష్టం చేశారు.