PBKS vs DC | ధర్మశాలలో వర్షం.. పంజాబ్ – ఢిల్లీ మ్యాచ్ ఆల‌స్యం !

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ కీలకమైన పోరుకు సిద్ధ‌మైంది. ప్లేఆఫ్స్ కు ఒక విజయం దూరంలో ఉన్న పంజాబ్… ఈరోజు త‌మ సొంత మైదానం ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. దీని కారణంగా, సాయంత్రం 7:00 గంటలకు జరగాల్సిన టాస్ ఆలస్యమైంది.

జోరుమీదున్న పంజాబ్

ఇదిలా ఉంటే, శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్, ఈ సీజన్‌లో జోరుగా దూసుకుపోతోంది. వారు ఆడిన‌ 11 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి, మూడు ఓడిపోగా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

ఇక‌ ఈరోజు జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే… ప్లేఆఫ్ బెర్తును ఖాయం అవుతుంది. దీంతో, ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకున్న తొలి జట్టుగా పంజాబ్ నిల‌వ‌నుంది. అందుకే ఢిల్లీని సొంతగడ్డపై ఓడించి ప్లేఆఫ్‌కు చేరుకోవడమే పంజాబ్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వర్షం కారణంగా టాస్ ఆలస్యం అవుతోంది.

ఢిల్లీ గెలవాల్సిందే..

ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు పంజాబ్ కింగ్స్ పై విజయం అత్యవసరం. ఢిల్లీ జ‌ట్టు 11 మ్యాచ్ ల్లో ఆరు గెలిచి, నాలుగు ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఢిల్లీ ఖాతాలో 13 పాయింట్లున్నాయి. ఆ టీమ్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఢిల్లీ పంజాబ్‌పై గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్ అవకాశాలు మరింత దెబ్బతింటాయి.

Leave a Reply