MBNR | పహల్గాం ఉగ్ర దాడి నిందితులను కఠినంగా శిక్షించాలి

మక్తల్, ఏప్రిల్ 24 (ఆంధ్రప్రభ) : కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమ‌వుతుంది. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో 167వ జాతీయ రహదారిపై స్వామి వివేకానంద చౌరస్తా వద్ద ఉగ్రవాద దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా ధార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ… పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరపడం దారుణమన్నారు .ఈ దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

ఉగ్రవాదం ఎన్నటికీ సమర్థనీయం కాదన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడితోనైనా హిందూ సమాజం సంఘటితం కావాలని వారు పిలుపునిచ్చారు. మతోన్మాద ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని, అందుకు దేశమంతా ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఉగ్రవాద దిష్టిబొమ్మను ద‌హ‌నం చేస్తూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి, బజరంగ్ ద‌ళ్, ఏబీవీపీ, బీజేపీ నాయకులు తాలంపల్లి అనిల్ కుమార్, శ్రీధర్ గౌడ్, బి.కురుమయ్య, ఆర్ .మంజునాథ్ ,రాజా గౌడ్, కర్వ లింగం, అమరచింత శివరాం, ఆడెం శ్రీనివాసులు, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *