Osmania | ఆధార్ లేదని వైద్యం చేయని డాక్టర్లు – నడిరోడ్డుపై తల్లితో చిన్నారి అగచాట్లు
హైదరాబాద్ సిటీలో సీఎం సొంత జిల్లావాసి కష్టాలుసెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :తల్లికి బాగోలేక రోడ్డుపైనే పడిపోతే ఆ చిన్నారి మాత్రం తన తల్లిని ఒడిలో పెట్టుకుని సేవలు చేస్తోంది. ఆమె ఏం జరిగిందో.. ఎవరిని సాయం అడగాలో తెలియక ఆందోళన చెందుతోంది. అమ్మను డాక్టర్లు ఆస్పత్రిలో ఎందుకు చేర్చుకోవడం లేదో తెలియక అక్కడే రోడ్డుపై జీవిస్తూ దిక్కుతోచని స్థితిలో తల్లికుమార్తెలు ఉండిపోయారు. తల్లీకూతుళ్ల వేదన, ఆవేదన చూసిన వారు కన్నీళ్లు పెడుతున్నారు.
అసలు వారు ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు? ఇంతటి దీనస్థితికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే..
బతుకుదెరువుకోసం సిటీకి వస్తే..మహబూబ్నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీళ భర్త సురేశ్ ఆరు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. భర్త మృతి చెందిన నెల రోజులకు ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దిక్కుతోచని ఆ తల్లి ఆరేళ్ల కుమార్తెను వెంటబెట్టుకుని హైదరాబాద్కు వలస వచ్చేసింది. దొరికితే చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించడం. లేదంటే భిక్షాటనతో ప్రాణాలను నిలుపుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
కానీ, విధి మాత్రం ఆమెను పరీక్షిస్తూనే ఉంది. సరైన తిండి, కంటి నిండా నిద్ర లేకపోవడంతో ఆరోగ్యం దెబ్బతింది. దీంతో కదలలేని స్థితికి చేరింది.తల్లికోసం చిన్నారి ఆరాటం..ఎక్కడైనా చూపించుకుందామంటే డబ్బులు ఖర్చు అవుతాయి.. అదే ప్రభుత్వ ఆస్పత్రి అయితే ఉచితంగా వైద్యం చేసుకోవచ్చనే భావనతో హైదరాబాద్లోనే ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు.
అక్కడున్న వైద్య సిబ్బంది కేవలం ఆధార్ కార్డు లేదన్న కారణంతో వారిని చేర్చుకోలేదు. ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక, తన వాళ్లు అనే వారు లేక, పది రోజులుగా ఉస్మానియా ఆసుపత్రి బయటే ఆ మహిళ కటికనేలపై ఇలా దీనావస్థలో పడి ఉంది.
ఆమెకు ఆ చిన్నారినే సపర్యలు చేస్తోంది. చిన్నారి దీన స్థితి చూసి..ఆసుపత్రి వద్ద దాతలు అందించే నాలుగు ముద్దలు పెట్టి తల్లి ప్రాణాలను నిలిపేందుకు ఆ చిన్నారి అల్లాడుతోంది. అమ్మ కోలుకుంటుందో లేదో తెలియక, బిక్కుబిక్కుమంటూ ఆస్పత్రికి వచ్చిపోయే వారిని చేయిచాచి సాయం కోసం ఆర్థిస్తోంది. ఆ చిన్నారి దీన స్థితిని చూసి చలించిన ఓ వ్యక్తి తనను తీసుకెళ్లి స్నానం చేయించి, ఉతికిన గౌను తొడిగి మళ్లీ తల్లి దగ్గరే వదిలేశారని స్థానికులు తెలిపారు.