- సైనిక చర్యను ప్రశంసించిన కాంగ్రెస్ నేతలు
- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఈ ఆపరేషన్
- ప్రధాని మోదీ నిరంతర పర్యవేక్షణలో సైనిక చర్య
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైంది. అత్యంత కచ్చితత్వంతో కూడిన ఈ సైనిక దాడిని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. సాయుధ బలగాల ధైర్యసాహసాలను, కచ్చితమైన కార్యాచరణను వారు కొనియాడారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత సైన్యాన్ని అభినందించారు. “మన సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నాను. జై హింద్!” అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
భారత ప్రజంలంతా గర్వపడాలి: ఏఐసీసీ చీఫ్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత సాయుధ బలగాలను ప్రశంసించారు. “పాకిస్థాన్, పీవోకేల నుంచి పుట్టుకొస్తున్న అన్ని రకాల ఉగ్రవాదంపై భారత్కు దృఢమైన జాతీయ విధానం ఉంది. పాకిస్థాన్, పీవోకేలలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన మన భారత సాయుధ బలగాలను చూసి మేం గర్విస్తున్నాం. వారి దృఢ సంకల్పం, ధైర్యసాహసాలను అభినందిస్తున్నాం” అని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నాటి నుంచే, సరిహద్దు ఉగ్రవాదంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా భారత జాతీయ కాంగ్రెస్ సాయుధ బలగాలకు, ప్రభుత్వానికి అండగా నిలిచిందని ఆయన నొక్కిచెప్పారు. “ఈ తరుణంలో జాతీయ ఐక్యత, సంఘీభావం అత్యంత అవసరం. భారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ బలగాలతో ఉంది. గతంలో మా నాయకులు మార్గం చూపారు. మాకు జాతీయ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం” అని ఖర్గే స్పష్టం చేశారు.