దండకారణ్యం చుట్టుముట్టిన పోలీసులు
అడవిలోకి మూడు రాష్ట్రాల నుంచి వేలాది మంది పోలీసులు
ఒక వైపు ఎన్కౌంటర్.. మరో వైపు తనిఖీలు
ఎన్కౌంటర్లో ఒకరి మృతి
మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్ట వైపు భద్రతా దళాలు
తెలంగాణ, ఆంధ్ర అటవీ గ్రామాల్లో భయానక వాతావరణం
కాల్పులు ఆపాలని హరగోపాల్ వినతి

వాజేడు, ఆంధ్రప్రభ : దండకారణ్యంలో తుపాకీల మోతతో అడవిలో అలజడి ప్రారంభమైంది. ఒక వైపు పోలీసులు, మరోవైపు భద్రతా దళాలు అడవిని చుట్టుముట్టాయి. మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్ట స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు, భద్రతా దళాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో దండకారణ్యం చుట్టు ఉన్న గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే భద్రతా దళాలకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇందులో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరు మావోయిస్టులు కర్రెగుట వైపు పారిపోయారని భద్రతా దళాలు, పోలీసులు భావించారు.
కర్రెగుట్ట లక్ష్యంగా పోలీసు బలగాలు

ములుగు జిల్లా కర్రెగుట్ట లక్ష్యంగా పోలీసులు అడవిలోకి ప్రవేశించారు. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు ముప్పేట దాడులు చేయడం, వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు నేలకొరగడంతో మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టకు చేరుతున్నారు. అక్కడే కీలకనాయకులు ఆవాసం ఏర్పర్చుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను టార్గెట్ చేస్తూ బాంబులు అమర్చినట్లు, అటువైపు గిరిజనులు ఎవరూ రాకూడదని మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్కు సిద్ధపడ్డారు.
దండకారణ్యంలోకి వేలాది మంది పోలీసులు
దండకారణ్యంలోకి సోమవారం సాయంత్రం వేలాది మంది పోలీసులు ప్రవేశించారు. తెలంగాణ నుంచి నాలుగు వేల మంది పోలీసు బలగాలు, భద్రతా దళాలు సోమవారం అడవిలోకి బయలుదేరి వెళ్లాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ చింతూరు తదితర ప్రాంతాల నుంచి రెండు వేల మంది పోలీసులు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి ఎనిమిది వేల మంది పోలీసు, భద్రతా బలగాలు అడవుల్లోకి వెళ్లినట్లు తెలిసింది. అంతకు ముందు ఆదివారం హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.

బచావో కర్రెగుట్ట పేరుతో ఆపరేషన్
ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి.
కొనసాగుతున్న ఎన్కౌంటర్
ఊసూర్ బ్లాక్ల్లోని కర్రెగుట్టల సమీపంలో మంగళవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కాల్పులు ఆపండి: హరగోపాల్
కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. తమకున్న సమాచారం మేరకు భద్రతాబలగాల వైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయని, ఇప్పటికే వేలాది మంది భద్రతా బలగాలు కర్రెగుట్టల చుట్టూ మోహరించారని, వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించవచ్చని తెలిపారు. వెంటనే సాయుధ చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని తెలిపారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.