మందుపాతరల తొలగింపు అతిపెద్ద సవాల్
మూడు బేస్ క్యాంపుల ఏర్పాటుకు సన్నహాలు
మావోయిస్టులకు మద్దతుగా వామపక్షపార్టీల ర్యాలీలు
సీఎంను కలిసిన శాంతి చర్చల కమిటీ నేతలు
సామాజిక సమస్యగా పేర్కొన్న సీఎం రేవంత్
ఆపరేషన్ కగార్ ఆపాలని కేంద్రానికి కేసీఆర్ వినతి
శాంతిచర్చలపై నోరు మెదపని కేంద్ర ప్రభుత్వం
సెంట్రల్ డెస్క్, హైదరాబాద్ :
కర్రెగుట్టల్లో ఏడో రోజైన సోమవారం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగింది. శనివారం సాయంత్రమే అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు అణువణువు పరిశీలన చేస్తున్నాయి. పెద్ద సొరంగంతోపాటు వందకు పైగా బంకర్లు ఉన్నట్లు పోలీసు బలగాలు గుర్తించాయి. బంకర్లలో మావోయిస్టులు ఉన్నారేమో అని వేట కొనసాగిస్తూనే.. అడుగడుగున అమర్చిన మందుపాతరలు పేలే ప్రమాదం ఉందని అచీతూచి అడుగులు వేస్తున్నారు. రైస్ కుక్కర్లో బాంబులు అమర్చి.. భారీ విస్ఫోటనం కలిగించి, ప్రాణాలుహరించే బాంబులు అమర్చినట్టు భద్రతా దళాలు గుర్తించాయి. ఇప్పటి వరకు వందకు పైగా మైన్స్ నిర్వీర్యం చేశారు. కొన్ని మందుపాతరలు పేలాయి. బంకర్లలో తలదాచుకున్న మావోయిస్టులను బయటకు రప్పించేందుకు హెలికాప్టర్ ద్వారా భద్రతా దళాలు బాంబులు వేస్తున్నాయి. బాంబుల మోతతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి.
మూడు బేస్ క్యాంపుల ఏర్పాటు..
కర్రెగుట్టల్లో మూడు బేస్ క్యాంపులు ఏర్పాటు భద్రతా దళాలు సన్నాహాలు చేస్తున్నాయి. పామునూరు ప్రాంతంలో రెండు బేస్ క్యాంపులు, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఉసూర్ అటవీ ప్రాంతంలో ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొంత కాలం సీఆర్పీఎఫ్తోపాటు కోబ్రా, డీఆర్జీ దళాలు ఉండనున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ మద్దతు కూడగడుతున్న హరగోపాల్
మావోయిస్టులపై మారణ హోమం ఆపాలని శాంతి చర్చల కమిటీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వివిధ ప్రాంతాలను పర్యటించిన శాంతి చర్చల కమిటీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలని ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని వామపక్ష పార్టీలతోపాటు మేథావులు పాల్గొన్నారు. వరంగల్లో హరగోపాల్ ప్రెస్మీట్ పెట్టి ఆపరేషన్ కగార్ ఆపేయాలని కోరారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ వినతి పత్రం ఇచ్చింది. మారణహోమం ఆపాలని, శాంతి చర్చలకు కేంద్రం వచ్చేలా ఒత్తిడి తేవాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ ఉన్నారు. కాగా, తమ ప్రభుత్వం సామాజిక కోణంలో ఈ అంశాన్ని చూస్తుందని సీఎం రేవంత్ అన్నారు. గతంలో నక్సల్స్తో చర్చలు జరిపిన అనుభవం ఉన్న సీనియర్ నేత జానారెడ్డి, ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు.
జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై చర్చించారు. శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలో సోమవారం ఉదయం జానారెడ్డితో సీఎం భేటీ చర్చనీయాంశమైంది.
మావోయిస్టులతో చర్చలు జరపాలి : కేసీఆర్
మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, కేసీఆర్ కోరారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ కగార్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారని.. అది సరైంది కాదన్నారు. బలగాలున్నాయని చంపుకొంటూ పోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేయాలని, చర్చలకు పిలవాలని కోరారు. కాగా, ప్రజా ఆమోదం మేరకు ఆపరేషన్ కగార్ను ఆపాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.
మావోయిస్టుల వినతి.. పట్టించుకోని కేంద్రం
ఆపరేషన్ కగార్ ఆపేయాలని, శాంతికోసం తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు కేంద్రాన్ని కోరుతున్నారు. కాగా, కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడానికి భద్రతా దళాలు మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు నేత రూపేస్ పేరుతో మరో లేఖ విడుదలైంది. శాంతి చర్చలకు సిద్దమని, కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఆపేయాలని అందులో కోరారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా కేంద్ర మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.