మోత్కూర్, మార్చి 1(ఆంధ్రప్రభ) : చింతచెట్టు ఎక్కి చింతపండు తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో చెట్టు పైనుండి పడి ఒకరు మృతిచెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని కొండాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… మూటకొండూర్ మండలం వర్టుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాఖం పల్లి గ్రామానికి చెందిన ఏర్పుల వెంకటేష్ (55) రెండురోజుల క్రితం తన అల్లుడు, బిడ్డ మొలకల మహేష్, మమత ఇంటికి వచ్చాడు.
వ్యవసాయ పనుల్లో అల్లునికి సహాయం చేసిన వెంకటేష్ శనివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఉన్న చింత చెట్టు ఎక్కి చింతపండు తెంపుతుండగా, కూతురు మమత చింత పండు ఏరుతుంది. ప్రమాదవశాత్తు కాలుజారగా, వెంకటేష్ చెట్టు పై నుండి పడడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆ సమయంలో అల్లుడు మహేష్, అతని తల్లి వసంతలు బ్యాంకు పని మీద మోత్కూర్ కి వెళ్లారు. మృతునికి భార్య, ఒక బిడ్డ, ఒక కొడుకు ఉన్నారు.
కుమారునికి ఇంకా వివాహం కాలేదు. కూతురు మమత ఇంటికి వచ్చి తండ్రి వెంకటేష్ మృత్యువాత పడడంతో బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున రోధించారు. 6నెలల క్రితమే అనారోగ్యంతో మహేష్ తండ్రి ఉప్పలయ్య మృతిచెందగా, ఇంటికి వచ్చిన మామ వెంకటేష్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ డి.నాగరాజు సందర్శించి పంచనామా నిర్వహించారు. అల్లుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.