భువనేశ్వర్ – ఒడిశాలో (Odisha ) ఒక అమానుషమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి (love marriage ) చేసుకున్నందుకు ఒక యువ జంటను కొందరు దుండగులు ఎద్దుల్లాగా కాడికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (video) సోషల్ మీడియాలో (social media ) వైరల్ (viral) కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, రాయగఢ జిల్లా కంజమాజిర గ్రామంలో ఈ యువతి, యువకుడు స్థానిక సాంఘిక కట్టుబాట్లను అతిక్రమించి వివాహం చేసుకున్నారు. అందుకు శిక్షగా వారితో పొలం దున్నించారు. వారిని కాడికి కట్టి, ఎద్దుల్లాగా పొలం దున్నుతూ ఉండగా కొందరు వ్యక్తులు వారిని కొడుతుండడం, ముల్లు కర్రతో పొడవడం వీడియోలో కనిపించింది.
ఈ సంఘటనపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు అమానవీయమని, చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలో మరోసారి కుల వివక్ష మరియు సాంఘిక కట్టుబాట్ల పేరుతో జరుగుతున్న దారుణాలను గుర్తు చేసింది. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నందుకు ఇలాంటి శిక్షలు విధించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.