- 7 నుంచి సమ్మె..
- రూ.1500 కోట్లు విడుదల చేస్తేనే కొనసాగింపు
- ప్యాకేజీలలో మార్పులు లేకుంటే నాణ్యతకు ప్రమాదం
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రజలకు అందించే వైద్య సేవలను ఈనెల 7వ తేదీ నుంచి పూర్తిగా నిలిపి వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయి పడ్డ రూ.3500 కోట్ల రూపాయలలో తక్షణం రూ.1500 కోట్లు విడుదల చేయాలని అప్పుడే వైద్య సేవలను పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
గురువారం విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆషా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా విజయకుమార్, డా.అవినాష్, ప్రతినిధులు మాట్లాడారు. ప్రతి నెల సుమారు రూ.350 కోట్లు విలువైన వైద్య సేవలను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అందిస్తూ వస్తున్నామని అన్నారు.
అయితే పూర్తిస్థాయిలో ఏనాడు చెల్లింపులు జరగలేదని తెలిపారు. మార్చి నెలాఖరుతో బ్యాంకుల నుంచి, ఇంప్లాంట్స్, వివిధ మిషనరీ సంస్థల నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 నుంచి నేటి వరకు పథకంలో భాగంగా అందించే వైద్య సేవల ప్యాకేజీలకు సంబంధించి ఎటువంటి పెంపు జరగలేదన్నారు.
ఇతర పనులకు పిలిచే టెండర్లలో ఈ పదేళ్లలో సుమారు 50 శాతం మేర పెంపు జరిగినప్పటికీ అత్యంత ప్రధానమైన వైద్య రంగంలో మాత్రం ఒక రూపాయి పెంపు లేదన్నారు. దీంతో ప్రజలకు అందించే వైద్య సేవల నాణ్యతను ప్రభుత్వాలు పణంగా పెడుతున్నాయని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ విభజించబడి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ చెప్పుకోదగ్గ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు కాలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన మన రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్ వంటి పెద్ద స్థాయిలోని అధికారులు పక్క రాష్ట్రాల హాస్పిటల్స్ కు వెలుతున్నారని అన్నారు.
దీనిని బట్టి చూస్తే ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అన్న భావన ప్రజల్లో నెలకొన్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద బకాయిలను తక్షణం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.