హైదరాబాద్ – రాజ్ భవన్ చోరి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఇక్కడ పని చేసిన మాజీ ఉద్యోగి హార్డ్ డిస్క్ ల మాయం కేసులో సూత్రధారి అంటూ వెల్లడించారు అధికారులు.. ఎటువంటి కీలక పత్రాలు, సమాచారం దొంగిలించలేదంటూ వివరణ ఇచ్చారు..
వివరాలలోకి వెళితే ఈ నెల 10 వ తేదిన రాజభవన్ లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగి తన ఫోటోలను ఎవరో అసభ్యంగా మార్పింగ్ చేసారని, ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలను శ్రీనివాస్ అనే సహోద్యోగికి పంపించాడు. ఈ విషయం శ్రీనివాస్ ద్వారానే తనకు తెలిసిందనే సహోద్యోగి పిర్యాదు చేసింది.. దీంతో కేసు నమోదు చేసి శ్రీనివాస్ ను ఈ నెల 12న అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. అనంతరం శ్రీనివాస్ బెయిల్ పై విడుదలయ్యాడు.. ఇక ఈ నేరం చేసిన శ్రీనివాస్ ను ఉద్యోగం నుంచి రాజభవన్ అధికారులు సస్పెండ్ చేశారు..
ఇక రాజ్ భవన్ లో శ్రీనివాస్ వినియోగిస్తున్న సిస్టమ్ హార్డ్ డిస్క్ లో మహిళలకు చెందిన మార్ఫింగ్ చేసిన అనేక ఫోటోలు ఉండిపోయాయి.. దీంతో శ్రీనివాస్ ఈ నెల 14 తేదిన హెల్మెట్ పెట్టుకుని ఎవరి కంట పడకుండా రాజ్ భవన్ లోని తాను పని చేసే చోటుకు చేరుకున్నాడు.. అక్కడ తన సిస్టమ్ లో ఉన్న హార్డ్ డిస్క్ ను తీసుకుని మరో కొత్త హార్డ్ డిస్క్ ఉంచి వెళ్లిపోయాడు.. దీనిని సిసి టివిలో గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు ఈ నెల 15వ తేదిన అతడిని తిరిగి అరెస్ట్ చేశారు.. అతడి నుంచి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు.. ఇది ఇలా ఉంటే గతంలో కూడా శ్రీనివాస్ మహిళలను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.
కాగా, బయటి వ్యక్తులు వచ్చి రాజ్ భవన్ లో దొంగతనం చేశారని; రాజ్ భవన్ కి సంబంధించిన కీలక విషయాలు ఉన్న డాక్యుమెంటులు కూడా పోయాయని వస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్ భవన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది..