న్యూఢిల్లీ : పాస్పోర్ట్ దరఖాస్తుదారుల ధృవీకరణలో ఆధునిక సాంకేతికత వినియోగానికి గుర్తింపుగా, తెలంగాణ పోలీసులకి జాతీయ స్థాయి ప్రశంస లభించింది. ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి, న్యూఢిల్లీలో జరిగిన పాస్పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో రాష్ట్ర పక్షాన ఈ అవార్డును స్వీకరించారు. అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా ప్రదానం చేశారు.
తెలంగాణ పోలీసుల రూపొందించిన “వెరిఫాస్ట్” (VeriFast) యాప్ దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ వేదికగా గుర్తింపు పొందింది. కేంద్ర విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా జాతీయ గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా పాస్పోర్ట్ ధృవీకరణ పూర్తి చేసే రాష్ట్రంగా నిలిచింది. చాలా కేసులను కేవలం మూడు నుంచి పది దినాల్లోనే పూర్తి చేస్తోంది.
ఈ సందర్భంగా డీజీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, “పాస్పోర్ట్ ధృవీకరణలో తెలంగాణ ఒక ‘గోల్డ్ స్టాండర్డ్’ స్థాయిని ఏర్పరిచింది. పౌరసేవల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా మేము నిరంతరం నూతన ఆవిష్కరణలపై పని చేస్తున్నాము,” అని తెలిపారు.