నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్కు గురైన బాలుడిని టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని టూటౌన్ పోలీసులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం బాలుడి తల్లి, ఫిర్యాదుదారు అయిన షమీమున్నీసా గత మూడేళ్ల నుంచి తన భర్త మహ్మద్ అహ్మద్, తన ఇద్దరు పిల్లలు.. కొడుకు అబ్దుల్ రహ్మాన్ (3), కూతురు అలీన (5) లతో కలిసి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త పెయింటింగ్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు బాలుడు అబ్దుల్ రహ్మాన్ ఆసుపత్రి ఆవరణలో ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆడుకుంటుండగా నార్కట్పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన రాపోలు సీతారాములు (40) ఆ బాలుడిని మచ్చిక చేసుకుని మాయమాటలు చెప్పి, కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించక పోవడంతో నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసును ఛేదించారు ఇలా…
కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ నాగరాజు వెంటనే రంగంలోకి దిగారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా బాలుని ఆచూకీ కోసం ఆరు పోలీస్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ టూ టౌన్ సీఐ ఎస్. రాఘవరావు పర్యవేక్షణలో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ రావుల నాగరాజు తన సిబ్బంది సాగర్ల శంకర్, లావూరి బాలకోటి, జానకి రామ్తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని సీసీ టీవీ కెమెరాలు పరిశీలించి నేరస్థుడిని గుర్తించారు.
పినతల్లి కుమార్తె కోసమే.. ఈ కిడ్నాప్
నిందితుడిని పట్టుకుని విచారించగా అతని పినతల్లి కూతురు ముద్దముల అరుణకు ముగ్గురు కూతుర్లు జన్మించారని, మగ సంతానం లేకపోవడంతో ఆమె కోసం బాలుడిని కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నాడు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో బాలుడు కొద్ది రోజుల నుంచి ఆడుకోవడం గమనించి కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. అనంతరం ఆ బాలుడిని తన చిన్నమ్మ కూతురు అరుణకు ఇచ్చినట్లు చెప్పాడు. దాంతో పోలీసులు అరుణ నుంచి బాలుడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును 24 గంటల్లో చేధించిన టూటౌన్ పోలీసులను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.