రాయలసీమలోని అనేక ప్రాంతాలో కుంభవృష్టి
వెలగపూడి – వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించి, కేరళ అనంతరం ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్టాయి. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోకి సోమవారం ప్రవేశించడంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఎనిమిది రోజుల ముందుగా, మే 24వ తేదీనే కేరళ తీరాన్ని తాకాయి. గతంలో 2009వ సంవత్సరం మే 23న సాధారణం కంటే ముందుగానే రుతుపవనాలు కేరళను పలకరించినట్లు వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 16 సంవత్సరాల తర్వాత రుతుపవనాలు మరోసారి ముందుగా పలకరించాయి.

ఇవి సోమవారం నాటికి రాయలసీమ ప్రాంతమంతటా విస్తరించాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇవి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రుతుపవనాల రాకతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. రైతులు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసి, రాష్ట్రంలోని జలాశయాలు నిండుతాయని, వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజలు ఆశిస్తున్నారు. అధికారులు కూడా రుతుపవనాల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు.