పంటలు, ఇళ్లపై దాడులు, భయాందోళనలో ప్రజలు

పంటలు, ఇళ్లపై దాడులు, భయాందోళనలో ప్రజలు

ఎ.కొండూరు మండలంలో కోతుల బెడద
అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజల వినతి

ఎ.కొండూరు,ఆంధ్రప్రభః ఎ.కొండూరు మండలంలోని, చీమలపాడు, కంభంపాడు,ఎ.కొండూరు, పోలిశెట్టిపాడు, రేపూడి, మాధవరం, కోడూరు, గొల్లమందల, రామచంద్రాపురం, వల్లంపట్ల, గోపాలపురం, కృష్ణారావు పాలెం, తదితర గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాల మధ్య, పంట పొలాల్లో,ఇళ్ల పైకప్పులపై ఎక్కడ చూసినా కోతుల సంచారం ఎక్కువ అవ్వటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు,వృద్ధులు, మహిళలు ఇళ్లలో నుండి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.ఇళ్లలో ఆహార పదార్థాలు లాక్కెళ్లడం, గ్రామాల్లో మామిడి,అరటి,జామ మొక్కజొన్న, వంటి పండ్ల తోటలు, కూరగాయల పంటలకు నష్టం కలిగిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పంట పండి ఇంటికి వచ్చే సమయంలో కోతులు గుంపులుగా వచ్చి కొమ్మలు విరిచి పండ్లు తినేస్తున్నాయని, మిగిలిన పళ్ళను కూడా పాడు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది రైతులు తమ పొలాల్లో రోజంతా కాపలా కాస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపి వాపోయారు. ఇళ్లలో విద్యుత్ తీగలు,టీవీ డిష్‌లు ధ్వంసం చేయడం పిల్లలపై దాడి చేస్తుండటంతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాల్లో ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి ఆహారం కోసం ఇళ్లలోకి జొరబడి బియ్యం సంచులు పాడు చేయటం, పండ్లు కూరగాయలు తినేస్తున్నాయని, వంటింట్లో ఉంచిన ఆహారాన్ని కూడా ఎత్తుకెళుతున్నాయని మహిళలు తెలిపి వాపోతున్నారు.

పిల్లలు బయట ఆడుకోవటానికి కూడా తల్లిదండ్రులు అనుమతించడం లేదని, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నారని, స్కూల్ బ్యాగుల్లో పెట్టుకున్న తినుబండారాలు ఎత్తుకెళ్తున్నాయని మహిళలు తెలిపి వాపోయారు. ఒక్కసారిగా గుంపులు, గుంపులుగా వచ్చి దాడి చేస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కోతుల వల్ల గాయాలు కావటమే కాకుండా విద్యార్థులను కరిచిన సంఘటన కూడా ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇటీవల చీమలపాడు లో పాఠశాలకు వెళ్లి ఇంటికి వెళుతున్న బాలుడిని కోతులు గుంపులు గుంపులుగా వచ్చి వెంబడించి కరిచాయని ఆ విద్యార్థి తల్లిదండ్రులు తెలిపి వాపోయారు.

దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు తెలిపారు. కోతుల దాడి వలన వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున తక్షణ చర్యలు తీసుకోవాలని చీమలపాడు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాలని, గ్రామాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని అంటున్నారు. గత రెండేళ్లలో కోతుల సంఖ్య పెరిగిపోయి,అటవీ ప్రాంతాల విస్తీర్ణం తగ్గిపోయి,గ్రామాల్లోకి ఆహారం కోసం జనవాసాల వైపు పడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.మా గ్రామాలను కోతుల బెడద నుంచి కాపాడండి అంటూ ప్రజలు వేడుకుంటున్నారు.


గ్రామస్తులు పలుమార్లు అటవీ శాఖ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వాపోతున్నారు. కోతులను అడవుల్లోకి తరలించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అటవీ శాఖ ద్వారా కోతులను పట్టుకొని అడవిలో విడిచి పెట్టేలా చర్యలు తీసుకోవాలని, చెత్త డంపింగ్ యార్డులను శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కోతుల నివారణకు సౌండ్,నెట్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పంచాయతీ అధికారుల కోరుతున్నారు. మా జీవనోపాధి,భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాలు సమర్పించడానికి మండల ప్రాంత ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ఆయా గ్రామాల పంచాయతీ అధికారులు, సర్పంచులు స్పందించి కోతుల బెడద నుండి కాపాడాలని, మండల ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి వేడుకుంటున్నారు.

Leave a Reply