పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 2(ఆంధ్రప్రభ): రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ నాయకులు ఉప్పు కిరణ్, కావేటీ రాజగోపాల్, పెంజర్ల రాకేష్, గుడ్ల సతీష్, సొల్లూరి మణికంఠ, పిట్ట వినయ్, మదుకర్ ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ కార్డుల ద్వారా పేదలకు కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో బియ్యం ఉచితంగా అందిస్తోందన్నారు. పెద్దపల్లి పట్టణం సుభాష్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్ర పటాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రధాని మోడీ చిత్రపటం ఎందుకు పెట్టడం లేదని అడిగారు.
ఎమ్మెల్యే విజయ రమణారావు బదులిస్తూ… కేవలం రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సన్నబియ్యానికి కేంద్రానికి సంబంధం లేదని నచ్చజెప్పారు. ప్రధానిపై ఎమ్మెల్యేగా నాకు అభిమానం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్లు తెలంగాణకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, ఎంపీలను ప్రశ్నించాలని బీజేపీ నాయకులకు చురకలంటించారు. మంచిపని చేస్తూ, తాము అందరినీ కలుపుకుని పోతుంటే అలుసుగా తీసుకుని రాద్దాంతం చేయడం మాని, తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది, ఇస్తుందో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని హితబోధ చేశారు.