హైటెక్స్లో గ్రాండ్ ఫినాలేకు రెడీ
ఇప్పటికే పూర్తయిన రిహార్సల్స్
మల్టీమీడియా చాలెంజ్లో నలుగురి ఎంపిక
ఫాస్ట్ ట్రాక్లో 16 మందికి దక్కిన చోటు
టాప్ 40 అందాల భామల జాబితా పూర్తి
ఆ ఒక్క ప్రశ్నతో ముగియనున్న పోటీ
జడ్జీల మనసులను గెలిచిన వారికే కిరీటం
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : మిస్ వరల్డ్ పోటీలు తుది ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. హైటెక్స్ వేదికగా శనివారం సాయంత్రం ఫైనల్స్ జరగనున్నాయి. దీనికోసం నిర్వాహకులు అందాల భామలతో కలిసి గురువారం ట్రైటెండ్ హోటల్, హైటెక్స్లో రిహార్సల్స్ చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా చాలెంజ్లో ఒక్కో ఖండం నుంచి ఒకరు చొప్పున మొత్తం నలుగురిని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్-కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరాడెల్గాడోబ్, ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ప్రిన్సెస్సీ, యూరోప్ నుంచి మోంటెనెగ్రో భామ ఆండ్రియా నికోలిక్, ఆసియా-ఓషియానా నుంచి థాయ్లాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ నలుగురు మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్(టాప్40) జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్ట్రాక్లో ఇప్పటివరకు 16 మంది భామలకు చోటు దక్కింది. కాగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు.
108 దేశాల నుంచి వచ్చిన భామలు..
హైటెక్స్లో జరిగే వేడుకకు 108 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మందే తదుపరి దశకు చేరుకుంటారు. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదటగా పిలుస్తారు. ఆ తర్వాత న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతారు. తరువాతి నుంచే ఫైనల్స్ ప్రారంభమవుతాయి.
ఆ ప్రశ్నతో విజేతను నిర్ణయిస్తారు..
టాప్ 40 నుంచి తదుపరి రౌండుకు 20 మందిని, ఆ తర్వాత వారిలో 8 మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసి ఉంటారు. మహిళల సమకాలిక సమస్యలు, ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు పోటీదారుల్లో ఎవరు ఉత్తమంగా సమాధానం ఇచ్చారనేది అక్కడ ఉండే న్యాయనిర్ణేతలు నిర్ణయిస్తారు. అలా ఎనిమిది మంది నుంచి నలుగురిని ఎంపిక చేస్తారు. ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారు? అనే ఆఖరి ప్రశ్న అడుగుతారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరి ఎవరనేది నిర్ణయమవుతుంది. విజేతకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని ధరింపజేయడంతో వేడుక ముగుస్తుంది.
హైటెక్స్లో వేడుక లైవ్లో చూడాలంటే..
తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అద్భుతంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే గ్రాండ్ ఫైనల్ మొదలు కాబోతుంది. తెలంగాణలోని హైదరాబాద్లో హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ వేడుక గ్రాండ్గా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే.. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు లైవ్లో చూసేవిధంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ సుందరి ఎవరో తెలుసుకోవాలనే కోరిక ఉన్నవారందరూ.. ప్రపంచంలో ఎక్కడా ఉన్నా ఈ ఈవెంట్ చూసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ను ఎంపిక చేసిన దేశాల్లో అక్కడి నేషనల్ టెలివిజన్ ద్వారా లేదా www.watchmissworld.com అధికారిక వెబ్సైట్ ద్వారా చూసే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనిలో మీరు మిస్ వరల్డ్ పే-పర్-వ్యూ ప్లాటాఫామ్ ద్వారా హై డెఫినిషన్లో చూడవచ్చు.
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ ప్రసార సమయాలు..
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మే 31, 2025 అంటే శనివారం రోజున హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. మధ్యాహ్నం 1గంటకు ఈవెంట్ స్టార్ట్ కానుంది. టీవీలో లైవ్ అందుబాటులో ఉంది కాబట్టి.. ఈవెంట్ను చూడాలనుకుంటే స్థానికంగా ప్రసారమయ్యే చానల్స్లో చూడవచ్చు. లేదంటే www.watchmissworld.com వెబ్సైట్ ద్వారా వీక్షించవచ్చు. ఇండియాలో ఈ ఈవెంట్ని చూడాలనుకునేవారు SonyLIVలో చూడొచ్చు.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా..
అందం, అంతర్జాతీయ ఐక్యతకు వేడుకగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 108 మంది యువతులు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ ఏడాది ఈ ఈవెంట్కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. తెలంగాణ సాంస్కృతిని ప్రతిబింబించేలా ఈ గ్రాండ్ ఫైనల్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యూటీతో పాటు.. తెలివితేటలను కూడా కంటెస్టెంట్లు చూపించాల్సి ఉంటుంది. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే కాన్సెప్ట్తో సామాజిక అవగాహన కల్పించనున్నారు.
ఫైనల్స్లో నందిని గుప్తా..
టాప్ మోడల్ విన్నర్స్లో ఇండియాను రిప్రెజెంట్ చేస్తున్న నందిని గుప్తా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 108 మంది పోటీదారులు పాల్గొనగా.. నాలుగు కాంటినెంటల్ విన్నర్స్లో నందిని గుప్తా నిలిచి 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ క్వార్టర్ ఫైనల్లో ఫాస్ట్ ట్రాక్ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే భారతీయులు ఈమె ప్రపంచ సుందరిగా గెలవాలని కోరుకుంటున్నారు.
ఇది గెలిస్తే.. భారత్కు ఏడో కిరీటం..
నందిని గుప్తా మిస్ వరల్డ్ కిరీటం అందుకుంటే ఇండియాను విజేతగా నిలిపిన 7 బ్యూటీగా నిలిస్తుంది. ఇప్పటివరకు రీటా ఫరియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. 2017 తర్వాత ఇండియాకు ఈ మిస్ వరల్డ్ కిరీటం దక్కలేదు. ఈ ఏడాది వస్తుందో.. లేదో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.