మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి హామీ

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ లో శనివారం మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యలతో కలిసి సంయుక్తంగా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పంట నష్టం చోటుచేసుకుందని, నిష్పక్షపాతంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను ఖచ్చితంగా లెక్కించి నివేదికలు సమర్పించాలన్నారు. రైతులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వాగులు, వంకలు మరియు కుందూ నది పొంగి ప్రవహించిన నేపథ్యంలో ‘రివర్స్ స్ట్రాటజీ’ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నంద్యాల పట్టణాన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడగలిగామన్నారు.

తుఫాన్ ప్రభావం కారణంగా మున్సిపాలిటీకి కూడా గణనీయమైన నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిత్యం పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి సమయానుకూల ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడంతో ప్రజలను సురక్షితంగా కాపాడగలిగామని అన్నారు. తుఫాన్ సమయంలో వాగుల్లో పొంగిపొర్లుతున్న నీరు రోడ్లపై ప్రవహించడంతో కొంత కాలం పాటు రాకపోకలను నిలిపి వేశామన్నారు. రాష్ట్రంలో జరిగిన మొత్తం పరిస్థితిని ముఖ్యమంత్రికి సమగ్రంగా నివేదిస్తామని తెలిపారు.

అధికారులకు ప్రశంసలు

తుఫాన్ సమయంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమించి పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారని మంత్రులు పేర్కొన్నారు.ప్రజల భద్రత, పంట రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ దిశగా అధికారులు నిరంతరం కృషి చేసారన్నారు తెలిపారు.నేడు మనమంతా ప్రశాంతంగా కూర్చున్నామంటే కారణం క్షేత్రస్థాయిలో అధికారులు సమష్టిగా పనిచేసి తుఫాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడమేనని అన్నారు.

ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టం అంచనా వేయాలన్నారు. అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలన్నారు. కార్యాలయాల్లో కూర్చుని అంచనాలు వేయొద్దని స్పష్టం చేశారు. 48 గంటల పాటు పంట నీట మునిగితేనే నష్టపరిహారం అందజేస్తామన్న అధికారుల నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించి, రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా రహదారుల మరమ్మత్తు పనులు తక్షణం చేపట్టాలని, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు నష్టం అంచనా వేస్తే అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనితీరు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అర్ధరాత్రి 2 గంటలకైనా సచివాలయంలో ఉండి ప్రతి జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షించిన ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ సైతం తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.

సమయం పడుతుందేమో కానీ ప్రతి బాధితునికి న్యాయం చేస్తామని ధైర్యంగా చెప్పారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా బాధితులకు నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.కూటమి ప్రభుత్వం మరియు అధికారులు సమన్వయంతో పని చేయడం వల్లే ఈ విపత్తును సాఫీగా ఎదుర్కొనగలిగామన్నారు.గతంలో బనగానపల్లెలో కుందూ నది ప్రవాహం వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లేదని, అయితే ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో పంట నష్టం తీవ్రత తగ్గిందన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొంథా తుఫాను ప్రభావం ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో ఈ నెల నవంబర్ 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి విపత్తు సంభవించకుండా పూర్తి స్థాయిలో నిరోధక చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు.

….జిల్లాలో మొత్తం 30 మండలాలు ఉండగా, అందులో 27 మండలాలు వరద ప్రభావానికి గురై, సుమారు 244 గ్రామాలు వర్షాల వల్ల నష్టపోయినట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, భోజనం, వసతి వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముఖ్యంగా నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు మండలాలు ఎక్కువ వర్షాలకు గురై, సుమారు 17,055 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

జిల్లాలో పంట పొలాలకు సంబంధించి 65 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేసినట్లు తెలిపారు. అందులో 36,948 హెక్టార్ల పంటలు నష్టపోయాయి — వీటిలో 17 వేల హెక్టార్లు వరి, 17 వేల హెక్టార్లు మొక్కజొన్న, మిగతా 2 వేల హెక్టార్లు ఇతర పంటలు అని వివరించారు. పండ్ల తోటలకు సంబంధించి 744 హెక్టార్లు నష్టపోయాయని, ముఖ్యంగా మిరప, పపాయి, ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో సుమారు 27 వేల మట్టి మిద్దెలు ఉండగా, అధిక వర్షాల కారణంగా అక్కడ ఎవరూ ఉండకుండా రెవెన్యూ సిబ్బంది ద్వారా నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు.

సుమారు 7 వేల ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు.పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ. 1.20 లక్షలు, పక్కా ఇళ్లకు రూ. 6 వేల, కచ్చా ఇళ్లకు రూ. 4 వేల చొప్పున పరిహారం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖకు సంబంధించి 25 పడవలు, 34 చేప వలలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన 27 రోడ్లు సుమారు 110 కిమీ, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 6 రోడ్లు సుమారు 32.85 కిమీ నష్టపోయాయని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 17 వరకు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో అధిక వర్షాల కారణంగా వ్యవసాయం, హార్టికల్చర్ మినహా మొత్తం నష్టం రూ. 1686.01 లక్షలుగా అంచనా వేయబడిందని వివరించారు.

రివర్స్ స్ట్రాటజీ తో కుందూ నది నీరు మళ్లింపు…

…జిల్లాలో అధిక వర్షాల కారణంగా వెలుగోడు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో, నీటిని కుందూ నదికి విడుదల చేసినట్లు తెలిపారు. అయితే, కుందూ నదిలో నీరు పెరిగితే నంద్యాల పట్టణానికి వరద ముప్పు ఉండే అవకాశం ఉన్నందున, రివర్స్ స్ట్రాటజీ ద్వారా కుందూ నదిలోని నీటిని గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు మళ్లించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ చర్యలో జిల్లా మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a Reply