పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం

పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం

అగ్ని ప్రమాదం నివారణకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తక్షణ చర్యలు

ఉరవకొండ రూరల్ , ఆంధ్రప్రభ : ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలంలోని పాల్తూరులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం విషయం రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ దృష్టికి రాగా, మంత్రి తక్షణమే స్పందించి అగ్నిప్రమాద నివారణకు తగిన చర్యలు తీసుకున్నారు.


వేసవికాలంలో ప్రమాదవశాత్తు పాల్తూరు గ్రామంలో పలువురి రైతుల గడ్డివాములకు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కాలిపోతుండగా, గ్రామస్తులు, నాయకులు ఈ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకెళ్లారు. వెంటనే మంత్రి ఫైర్ శాఖ అధికారులతో మాట్లాడి రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి వేగవంతంగా ఫైర్ ఇంజన్లను తీసుకువచ్చేలా మంత్రి కృషి చేశారు. మరిన్ని గడ్డివాములకు అగ్నిప్రమాదం జరగకుండా ఫైర్ ఇంజన్లతో వాటిని ఆర్పి వేసేందుకు చర్యలు తీసుకున్నారు.

అలాగే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మంటలు పూర్తిగా అదుపు చేసేందుకు నీటి సరఫరా అవసరం ఉందని, పాల్తూరు గ్రామానికి 3 ఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు పాల్తూరు గ్రామానికి సాయంత్రం 5 గంటల నుంచి 3 ఫేస్ విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుని విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో మంత్రి పయ్యావుల కేశవ్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply