Vikarabad | యోగా ద్వారా మానసిక ప్రశాంతత : స్పీకర్ ప్రసాద్ కుమార్

వికారాబాద్, జూన్ 21 (ఆంధ్రప్రభ) : యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం ఉంటుంద‌ని తెలంగాణ‌ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం వికారాబాద్ (Vikarabad) పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ లో జరిగిన యోగా డే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) పాల్గొని ఆసనాలు వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ తన సందేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంద‌రికీ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం కూడా అని, తాను రోజు యోగా చేస్తానన్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అలాగే ఆచరించాలన్నారు.

యోగా (Yoga) ను నిత్యం సాధన చేయడం ద్వారా మనిషిలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చన్నారు. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇటీవల కాలంలో యోగా పట్ల ప్రజల్లో ఆసక్తి బాగా పెరిగిందన్నారు. ఎక్కువ మంది యోగాను చేస్తున్నారన్నారు. యోగా పుట్టింది మన భారతదేశంలోనేన‌ని, 2500 సంవత్సరాల క్రితం పతంజలి మహార్షి ద్వారా వెలుగులోకి వచ్చిందన్నారు.

ఐక్యరాజ్యసమితి (United Nations) యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. యోగా అనేది అందరిదీ.. అందరూ చక్కగా చేయవచ్చన్నారు. అన్ని వయసుల వారు యోగాను చేయవచ్చన్నారు. స్వంతంగా కంటే గురువుల మార్గదర్శకంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నారు. యోగాను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారన్నారు.

Leave a Reply