నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ) కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ డీఫ్యాక్టో సీఎంలా వ్యవహరించడం శోచనీయమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఆమె ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఇక డమ్మీ సీఎం అనేది స్పష్టమైపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా పగ్గాలను రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. కానీ ఆమె మాట తప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా సచివాలయానికి రావడం వెనుక రాహుల్ గాంధీ ఆదేశాలున్నాయని తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో ఉండగా మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి రివ్యూ చేయడాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఒట్టి కోరలు లేని పాము అని అర్థం చేసుకోవాలన్నారు.
జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ తమ విధానమంటున్న కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగ పరిరక్షణ తమ ధ్యేయమని కార్యక్రమాలను నిర్వహిస్తూ, పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు… రాజ్యాంగ పరిరక్షణ విధానం ఓ నినాదం గానే మిగిలిపోయిందన్నారు. అది ఆచరణలో శూన్యమని మీనాక్షి నటరాజ్ నిరూపించారన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జులుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వయలార్ రవి వంటి నేతలు ఏనాడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. గతంలో ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రాజీవ్ గాంధీ అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నఅంజయ్యను ఎయిరుపోర్టులో అవమానించారన్నారు. తండ్రి రాజీవ్ గాంధీ బాటలోనే కుమారుడు రాహుల్ గాంధీ నడుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారును రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాలనుకుంటున్నారు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇపుడు డమ్మీ సీఎంగా మిగిలిపోయిన రేవంత్ రెడ్డి త్వరలోనే మాజీ సీఎంగా మారతాడని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుందన్నారు.
తెలంగాణ సకల జనులు కోట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చులకన చేస్తోందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుందన్నారు. ఇదేనా మార్పు, రిమోట్ కంట్రోల్ పాలనేనా మార్పు అంటే అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు నరేందర్, నవీన్, పద్మాకర్, సత్యం చంద్రకాంత్ , ముత్యం రెడ్డి, జమాల్, విలాస్, విజయ్,తిరుమల చారి , ముత్యం తో పాటు తదితరులు పాల్గొన్నారు.