• వీటి విలువ రూ.1.80 కోట్లే


(ఆంధ్రప్రభ, బాపట్ల బ్యూరో) : ఏపీలోని బాపట్ల (Bapatla) జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి 255 ల్యాప్‌టాప్‌లు మాయం అయ్యాయి. ఈ చోరీ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా కొరిటపాడు మండలం మేదరమెట్ల గ్రామ సమీపంలోని ఓ దాబా దగ్గర శనవారం ఓ కంటైనర్ కనిపించింది. ఎఫ్ సీ ఎల్ ట్రాన్స్‌పోర్ట్‌కు ఈ కంటైనర్ 255 ల్యాప్‌టాప్‌లు, 150 హెచ్ పీ 150 ప్రింటర్‌లతో ముంబై నుంచి చెన్నైకి వెళుతోంది. కంపెనీకి చెందిన మరో నాలుగు కంటైనర్ లు (Four containers) కూడా అదే మార్గంలో ప్రయాణిస్తున్నాయి. కంపెనీ అన్ని కంటైనర్లలో డోర్ లాక్ అలారంను ఏర్పాటు చేసింది. కంపెనీ అధికారులను శనివారం రాత్రి అలారం అలెర్ట్ చేసింది.

అద్దంకి మండలం చిన్నకోతపల్లి సమీపంలో కంటైనర్ తలుపు తెరిచి ఉంది. డ్రైవర్ , క్లీనర్ లను కంపెనీ సిబ్బంది ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావటంతో కంపెనీ సిబ్బంది విజయవాడ (Vijayawada)లోని తమ ప్రతినిధులకు సమాచారం అందించారు. మేదరమెట్ల గ్రామ సమీపంలోని ఒక దాబా వద్ద ఆపి ఉంచిన హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కంటైనర్‌ను కనుగొన్నారు. ఈ తనిఖీలో 255 ల్యాప్‌టాప్‌లు, ఒక మానిటర్ ఒక టోనర్ కనిపించలేదు. ప్రింటర్లను మాత్రం వదిలేశారు. కంపెనీ ప్రతినిధులు మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చీరాల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Deputy Superintendent of Police) తెలిపారు. పోలీసుల అంచనా ప్రకారం, ఈ ల్యాప్‌టాప్‌ల విలువ రూ.95 లక్షలు ఉంటుందని అంచనా. అన్ని పన్నులను పరిగణనలోకి తీసుకుంటే, ల్యాప్‌టాప్‌ల వాస్తవ విలువ రూ.1.80 కోట్లు ఉండవచ్చు. బాపట్ల జిల్లాలోని టోల్ గేట్ల నుంచి సీసీటీవీ ఫుటేజీల (CCTV footage) ను పోలీసు బృందాలు స్కాన్ చేస్తూ ఆధారాలు సేకరించాయి. డ్రైవర్, క్లీనర్ గురించి కంపెనీ సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించడానికి బృందాలు జల్లెడ పట్టాయి.

Leave a Reply