ADB | పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని.. బడికి తాళం వేసి నిరసన

దండేపల్లి, జూన్18 (ఆంధ్రప్రభ): దండేపల్లి మండలం వెల్గనూర్ (Velganur) ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి పథకం కింద చేసిన పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం పాఠశాల చైర్మన్ గడికొప్పుల విజయ, భర్త తిరుపతి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాలలో నూతన డైనింగ్ హాల్, టాయిలెట్స్, వాటర్ సంపు, విద్యుత్ మరమ్మతు, ప్రహరీ పనులు చేయగా సుమారు రూ.28లక్షల ఖర్చు చేశానన్నారు. తమకు మాత్రం కేవలం రూ.5 లక్షల బిల్లు మాత్రమే వచ్చిందని, ఇంకా రూ.23లక్షల బిల్లులు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, చేసేదేమీ లేక పాఠశాల గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు (Teachers), విద్యార్థులు గేటు బయట నిరీక్షించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న లక్షేటిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ తహసీనుద్దీన్, లక్షేటిపేట ఎస్సై సురేష్ లు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం పాఠశాల యధావిధిగా కొనసాగింది.

ఈక్రమంలో కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం వల్ల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుందని, బిల్లులు పెండింగ్‌లో ఉంచుతుందని మండిపడ్డారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ విజయ (Vijaya) మాట్లాడుతూ… రూ.28 లక్షల పనులు అప్పులు తీసుకొచ్చి చేశానని, వడ్డీలు కట్టలేక పోతున్నానని వాపోయింది. అప్పు పత్రాలు చూయిస్తూ కన్నీటి పర్యంతమైంది. జిల్లా కలెక్టర్ తో సహా సంబంధిత అధికారులకు కలిసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రోధించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply