(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికతకు అనుగుణంగా, ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేలా ముఖ్యంగా యువత, మహిళలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ఎంఎస్ఎంఈ థీమ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ లక్ష్మీశ స్టాల్ను ప్రారంభించి, స్టాల్ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక రంగానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించి తన కాళ్లపై తాను నిలబడడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించాలనుకునే ఔత్సాహికులకు పారిశ్రామిక విధానాలు, అనుమతుల మంజూరు ప్రక్రియ, మౌలిక సదుపాయాలు, వినూత్న వాణిజ్య అవకాశాలు, ప్రాజెక్టుల రూపకల్పన, రుణాలతో పాటు వివిధ వనరుల పరంగా మద్దతు లభించే పీఎంఈజీపీ, ముద్రా, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. పారిశ్రామిక యూనిట్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలన్నారు.
ఆధునిక మార్కెటింగ్ సౌకర్యాలపైనా అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్టాల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన సేంద్రియ ఎరువుల స్టాల్ను కూడా కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీపీవో పి.లావణ్య కుమారి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారయ్య, పీసీబీ ఈఈ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.