చిరుత దాడి

చిరుత దాడి
రెండు గొర్రెలకు తప్పిన ప్రమాదం
మాటు వేసి మెడను కొరికన చిరుత
గొర్రెల కాపరి అరుపులతో పలాయనం
( శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ)
తనకల్లు మండలంలోని తురకవాండ్ల పల్లి సమీపంలోని సింగరాతి చెరువు దగ్గర గొర్రెల మంద పై చిరుత పులి దాడి చేసింది. రెండు గొర్రె పిల్లల గొంతును కొరికింది. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గొర్రెల కాపరి కథనం మేరకు చిరుత తో పాటు మరో రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు గొర్రెల కాపరి వెంకటరమణ తెలిపాడు.
తాను భయపడి గట్టిగా కేకలు వేయడంతో గొర్రెలను వదిలేసి దగ్గరలోని చెట్ల పొదల్లోకి చిరుత, పిల్లలు పారిపోయినాయని వివరించాడు. విషయం తెలుసుకొని అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని, చిరుత సంచారం అంశంపై పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. అంతేకాకుండా గ్రామాలకు సమీపంలోని ఆయా ప్రాంతాలలో పర్యటించి అప్రమత్తంగా ఉంది సూచించారు. కాగా గత వారం పది రోజులుగా ఒక చిరుత రెండు చిరుత పిల్లలు కదిరి సమీపంలోని కదిరి కొండ ప్రాంతంలో సంచరించి అనంతరం నల్లచెరువు ప్రాంతంలో కి వెళ్లాయి. తాజాగా తనకల్లు మండలంలో మకాం వేసి, ఆయా ప్రాంతంలో సంచరిస్తున్నట్లు శనివారం నాటి సంఘటనతో తెలుస్తోంది. చిరుత సంచారం ప్రస్తుతం తనకల్లు మండల పరిధిలోని తురకవాండ్లపల్లి ఆ పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
