వాటికన్ సిటీ – క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. స్ట్రోక్తో పాటు హృద్రోగ సంబంధిత సమస్య వల్ల పోప్ ఫ్రాన్సిస్ ప్రాణాలు విడిచినట్లు వాటికన్ డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోప్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో అంత్యక్రియలు జరగనున్నాయి. పోప్కు కడసారి వీడ్కోలు పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
పోప్ అంత్యక్రియల్లో ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా తదితరలు పాల్గొననున్నారు. ఇక భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ మేరకు ముర్ము నిన్న వాటికన్ సిటీకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ పీటర్ డిసౌజా కూడా వెళ్లారు. వీరంతా పోప్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు. టర్స్ స్క్వేర్లో జరగనున్న సామూహిక ప్రార్థనల్లోనూ రాష్ట్రపతి పాల్గొంటారు.
కాగా , ఈ నెల 21వ తేదీన వాటికన్లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో కన్నుమూసిన విషయం తెలిసిందే. 2013, మార్చి 13వ తేదీన ఆయన పోప్ బెనడిక్ట్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ప్రజల సందర్శనార్థం పోప్ భౌతిక కాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉంచిన విషయం తెలిసిందే. అక్కడ లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి పోప్కు కడసారి నివాళులర్పించారు.