స్థానిక సంస్థల ఎన్నికలపై సిపిఐ కార్యదర్శి కూనమనేని స్పష్టం
హైదరాబాద్, ఆంధ్ర్రపభ : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. తమకు మిత్రపక్షమైన కాంగ్రెస్ తమతో కలసి వస్తే ఉమ్మడిగా పోటీ చేస్తామని, లేకుంటే బలంగా ఉన్న చోట అభ్యర్ధులను బరిలోకి దింపుతామని చెప్పారు. హైదరాబాద్ లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను కలుపుకోవడంలో వైఫల్యం చెందిందన్నారు. సమన్వయం చేసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీల కలయికతోనే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ మర్చిపోతున్నదని అసహనం వ్యక్తం చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ పాలనపై ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కాంగ్రెస్ కే …
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్ధుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎన్ కౌంటర్ పేరుతో హత్యలు…
మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో చంపేస్తున్నారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు. కాగా, మావోయిస్టులను అంతం చేసేందుకు మార్చి నెలలో ముహూర్తం పెట్టారు. ముహూర్తాలు ఎవరు పెడతారు.. ఎందుకు పెడతారు ? రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా మావోయిస్టులను మట్టుపెట్టడానికి ముహూర్తాలు పెట్టడం ఏమిటి ? మావోయిస్టులు సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారు. సంఘవిద్రోహులేమో అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటారు. ప్రజలకోసం పనిచేసే మావోయిస్టులను చంపేస్తారా?. అమిత్ షా హత్యలు చేస్తున్నట్టే.. అతనిపై విచారణ చెయ్యాలి’ అని కూనంనేని పేర్కొన్నారు.