హైదరాబాద్ ::మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ వర్కౌట్ సమయంలో గాయపడ్డారు ఈ విషయం గురించి కేటీఆర్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు.
జిమ్లో వ్యాయామం చేస్తుండగా వెన్నుపూస వద్ద గాయం జరిగినట్లు తెలిపారు. దీనితో వైద్యులు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని వెల్లడించారు. త్వరలోనే కోలుకుని తిరిగి సాధారణ జీవితానికి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేటీఆర్ గాయంపై పలు రాజకీయ పార్టీ నేతలు సానుభూతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ట్వీట్లు చేసి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, “వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని” కేటీఆర్కు హితవు పలికారు.
మరోవైపు మంత్రి లోకేశ్ కూడా “కేటీఆర్ గాయపడిన విషయం బాధ కలిగించింది, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశారు.
అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఈ సందేశాలు రాజకీయ పరిధిని దాటి మానవీయ కోణాన్ని ప్రతిబింబించాయి.ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో అనేక పోస్టులు చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు వెలిబుచ్చుతున్నారు. పార్టీ నాయకత్వం కూడా కేటీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ, ఆయన త్వరితగతిన ఆరోగ్యవంతుడిగా మారాలని ఆకాంక్షిస్తోంది.