Adilabad | సరిహద్దుల్లో కిల్లర్ టైగర్ ..!

  • చంద్రపూర్ జిల్లాలో హడలెత్తిస్తున్న బెబ్బులి!
  • 4 రోజుల్లో ఐదుగురు మృతి..
  • తునికాకు సేకరణకు నిషేధాజ్ఞలు


ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : కొమురం భీం జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో బెబ్బులి వరుస దాడులు ఆదివాసి గూడెల్లో హడలెత్తిస్తున్నాయి. వేసవిలో తునికాకు సేకరణకు అడవుల్లోకి వెళ్లే కూలీలపై పెద్ద పులులు పంజా విసురుతూ పొట్టన పెట్టుకుంటున్నాయి. తునికాకు సేకరించేందుకు పేద కూలీలు వెళ్లిన క్రమంలో రెండు రోజుల్లోనే పెద్దపులి నలుగురిని హతమార్చింది. ఇదే టైగర్ తాజాగా సోమవారం మరో మహిళ ప్రాణాలను బలిగొనడం కలకలం రేపింది. పెద్దపులుల వరుస దాడులు అటు అటవీ అధికారుల్లో, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మూల్ తాలూకాలో మరో మహిళా మృతి…
చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలోని బదూరణ గ్రామానికి చెందిన భూమిక బెందరే(28 ) అనే మహిళ సోమవారం ఉదయం భర్త ఉదయ్, ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణకు వెళ్లింది. ఆకు సేకరిస్తున్న క్రమంలో హఠాత్తుగా పులి ఆమెపై దాడిచేసింది. ఆమె కేకలు వేయడంతో వెంటనే ఇతరులు అప్రమత్తమై పరుగెత్తుకు వెళ్లడంతో అప్పటికే ఆమె పులి దాడిలో మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పరీక్షల నిమిత్తం మూల్ పట్టణానికి తరలించారు.

నాలుగు రోజుల్లోనే ఐదుగురిపై పంజా..
పులుల దాడిలో ఈనెల 10న చంద్రాపూర్ జిల్లా సిందెవాహి తాలూకా మెండ మాల గ్రామానికి చెందిన కూలీలు తునికాకు సేకరణకు వెళ్లారు. సాయంత్రం వరకు వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆచూకీ కోసం గాలించారు. అయితే చార్గావ్ అటవీ క్షేత్ర పరిధిలో ఓ చెరువు సమీపంలో కాంత చౌదరి (65), శుభాంగి చౌదరి (28), రేఖాసిండే (51) ముగ్గురు కూలీల మృతదేహాలను అటవీ సిబ్బంది గుర్తించారు. కాగా మరుసటి రోజు ఈనెల 11న మూల్ తాలుకా నాగోడ గ్రామానికి చెందిన విమల షిండే (64) అనే మహిళ తునికాకు సేకరణకు వెళ్లి పెద్ద పులి దాడిలో మృత్యువాత పడింది. వరుసగా నాలుగు రోజుల్లో ఐదుగురు తునికాకు కూలీలు మృతిచెందిన ఘటన తెలంగాణ సరిహద్దు అటవీ శివారులతో పాటు చంద్రాపూర్, బల్లార్షా జిల్లాల్లో భయాందోళనకు గురిచేస్తుంది.

తునికాకు సేకరణకు అడవుల్లోకి వెళ్ళకండి..
ఎండాకాలంలో ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే తునికాకు (బీడీ ఆకు) సేకరణను మహారాష్ట్ర అటవీశాఖ నిలిపివేసింది. చంద్రాపూర్ బల్లార్షా సరిహద్దుల్లో పెద్దపులుల దాడుల నేపథ్యంలో కొద్ది రోజులపాటు తునికాకు సేకరణ నిలిపివేశామని, కూలీలు అటవీ ప్రాంతాలకు వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పెద్ద పులుల సంచారం వరుస దాడుల నేపథ్యంలో సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *