కన్నడ నటుడు రిషబ్ శెట్టి నిర్మిస్తున్న కాంతారా-2 సినిమాకు వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదం కారణంగా జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విషాదకర ఘటన సినిమాను చుట్టుముట్టింది. కాంతారా-2 సినిమాలో నటిస్తున్న రాకేష్ పూజారి (32) చనిపోయారు. ఆదివారం సాయంత్రం ఉడిపి జిల్లాలో స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన రాకేష్.. మెహిందీ ఫంక్షన్లో ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.
అయితే, రాకేష్ మెహందీ వేడకలో దిగిన ఫొటోలను ఇన్స్టా ఖాతాలో పోస్టు చేశారు. అనంతరం సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇది జరిగిన కాసేపటికే రాకేష్ కన్నుమూశారు. దీంతో చివరిసారిగా పెట్టిన రెండు ఇన్స్టా పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, రాకేష్ కన్నడలో ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్ 3 విన్నర్గా నిలిచారు. ఇక 2014లో కడలే బాజిల్ అనే తుళు రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత రాకేష్కు మంచి పేరు వచ్చింది.
రాకేష్ అమ్మేర్ పోలీస్, ఉమిల్ వంటి కొన్ని కన్నడ, తుళు చిత్రాలలో నటించారు. ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్గా వస్తోన్న కాంతారా చాప్టర్ 2లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న చిత్ర బృందం.. మూవీని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. రాకేశ్ మృతి పట్ల పలువురు సినీ సెబల్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.