హైదరాబాద్: దిదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాదు.. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం.. దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా.. 2013, ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లో వరుస బాంబు పేలుళ్ల కేసుపై ఎన్ఐఏ సుదీర్ఘంగా విచారణ జరిపింది.
2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించి ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు నిందితులు. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెల్లడించింది. బాంబ్ బ్లాస్ట్లో వీరి కుట్ర ఉందని.. దోషులుగా తేల్చింది. ఈ ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది.
ఉరిశిక్ష పడింది వీరికే..
ఈ కేసులో ఏ2 అసదుల్లా అక్తర్ ( యూపీ), ఏ3జియ ఉర్ రహమాన్ ( పాకిస్థాన్), ఏ4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్ ( బీహార్ ), ఏ5 మహమ్మద్ యాసిన్ భత్కల్, ఏ6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్ (మహారాష్ట్ర) ఉన్నారు. అయితే ప్రధాన దోషి అయిన రియాజ్ భత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.