- నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ పేసర్
- భారత్తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
లండన్: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన ఆతిథ్య ఇంగ్లండ్ రెండో టెస్టు కోసం కూడా పటిష్టమైన జట్టును ఎంపిక చేసింది. జులై 2 నుంచి బర్హింగ్హమ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది.
ఈ జట్టులో ఇంగ్లండ్ విధ్వంసకర పేసర్ జోఫ్రా ఆర్చర్ చోటు సాధించాడు. 30 ఏళ్ల ఆర్చర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు 2021లో చివరిసారి టీమిండియాపైనే ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు.
అయితే గతేడాది మేలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఆర్చర్కు ఇంగ్లండ్ టెస్ట్ స్క్వాడ్లో చోటు లభించింది. కాగా, ఈ ఒక్క మార్పు మినహా ఇంగ్లండ్ జట్టు ఇతర మార్పులేమి లేవు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆడిన జట్టే బర్మింగ్హమ్లో యధావిథిగా కొనసాగుతుందని ఈసీబీ వెల్లడించింది.
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ పేసర్లు జోష్ టంగ్ 7, బెన్ స్టోక్స్ 5, బ్రైడన్ కార్స్ 4 వికెట్లతో విజృంభించారు. ఇప్పుడు వీరికి తోడుగా మరో ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా జట్టులోకి చేరడంతో ఇంగ్లండ్ పేస్ విభాగం మరింత పటిష్టంగా మారింది.
రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్, జాక్ క్రాలే, జో రూట్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, షోయబ్ బషీర్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, ఓలీ పోప్.