ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో – ) క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఆది దంపతుల గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శుక్రవారం భక్తి ప్రపత్తులతో కొనసాగింది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం.

శుక్రవారం ఉదయం ఫాల్గుణ పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి,కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది.భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.