ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన మొదటి టీ20I మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్కు ఇది శుభారంభం కాగా, భారత జట్టు 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే, టీ20లలో ఇంగ్లాండ్పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విషేశం.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు స్మృతీ మండానా, షఫాలీ వర్మ అదిరే ఆరంభం అందించారు. షఫాలీ నెమ్మదిగా ఆడుతుండగా, మండానా మాత్రం మొదటి బంతి నుంచే అటాక్ చేసింది. ఈ జోడీ 77 పరుగుల భాగస్వామ్యం అందించింది. షఫాలీ 20 పరుగులతో అవుట్ అయినా, మండానా మాత్రం తగ్గేదే లే అన్నట్టు చెలరేగింది.
ఆ తర్వాత హర్లీన్ దియోల్ (23 బంతుల్లో 43) తో కలిసి మరో 94 పరుగుల భాగస్వామ్యం ఏర్పాటు చేసిన మందానా.. తన కెరీర్లో తొలి టీ20 శతకం నమోదు చేస్తూ 62 బంతుల్లో 112 పరుగులు చేసింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 210/5 స్కోర్ చేసింది. ఇది భారత్ మహిళల టీ20లలో రెండవ అత్యధిక స్కోర్.
ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ (3/27) మాత్రమే మెరుగ్గా బౌలింగ్ చేయగా.. మిగతా బౌలర్లు భారత దూకుడును ఆపలేకపోయారు.
అనంతరం లక్ష్యచేపట్టేందుకు వచ్చిన ఇంగ్లాండ్కు బ్యాటింగ్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు డానియేలా వైట్ (0), సోఫియా డంక్లీ (7) తొందరగా పెవిలియన్ చేరారు. నాట్ స్కైవర్-బ్రంట్ మాత్రం పోరాటం చేసింది. కానీ మిగతా ఆటగాళ్లెవ్వరూ నిలబడలేకపోయారు.
ఎమీ జోన్స్ (1), అలిస్ కాప్సీ (5), ఎమిలీ ఆర్లెట్ (12)లు నిరాశ పరిచారు. కెప్టెన్ స్కైవర్ 42 బంతుల్లో 66 పరుగులు చేసినా, ఆమె అవుటైన తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. మొత్తం జట్టు 14.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్ల తరుఫున అరంగేట్రం ప్లేయర్ నల్లపురెడ్డి శ్రి చారాణి మెరుపులు మెరిపించింది. ఆమె 3.5 ఓవర్లలో 4 వికెట్లు తీసి కేవలం 12 పరుగులే ఇచ్చింది. అలాగే దీప్తి శర్మ (2/32), రాధా యాదవ్ (2/15), అమంజోత్ కౌర్ (1/22), అరుంధతి రెడ్డి (1/18) కీలక పాత్ర పోషించారు.
బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించిన భారత్ ఇంగ్లాండ్ పై 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.