మంచిర్యాల : బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనేదే నా తపన.. ఆరాటం తప్పితే ఇంకేం లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దంటూ పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి స్పష్టం చేశారామె. మంచిర్యాల పర్యటనలో ఉన్న ఆమె నేడు మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. డాడీ కేసీఆర్ ను కలిసే అవకాశం వచ్చినా.. కలవలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారామె.
లిక్కర్ స్కాంలో తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని కలుపుతామని తనకు చెప్పారని.. విలీనానికి అస్సలు ఒప్పుకోలేదంటూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు కవిత. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని పార్టీని సొంతంగానే కాపాడుకుందాం అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కవిత.
తనకు సొంత ఎజెండా అంటూ ఏమీ లేదని.. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యం, తపన తప్పితే ఇంకేమీ లేదంటూ మీడియా చిట్ చాట్ లో వెల్లడించారామె. బీజేపీతో పొత్తు, విలీనం అనే రెండు అంశాలకు నేను వ్యతిరేకం అని స్పష్టం చేసిన కవిత.. తాను రాసిన లెటర్ ను సమర్ధించుకున్నారు. లెటర్ రాయటంలో తప్పేంలేదని, ఆ లేఖ బయటకు తెచ్చిన వారిని పట్టుకోవాలని, వాళ్లు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారామె. తండ్రి కేసీఆర్ ను కలవాలని ఎంతో ప్రయత్నించానని, కలిసే అవకాశం వచ్చినా.. కలవలేకపోయానంటూ తన బాధను మీడియా చిట్ చాట్ లో వివరించారు కల్వకుంట్ల కవిత.