AP | అనంతలో భారీ వ‌ర్షం.. లోతట్టు ప్రాంతాలు మునక

అనంతపురం బ్యూరో, మే 15 (ఆంధ్రప్రభ) : అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రాప్తాడు సమీపంలోని శివారు కాలనీలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వారిని అధికారులు రక్షణ చర్యలతో బయటకు తెచ్చారు. నీట మునిగిన ఇళ్లలో అన్ని వస్తువులు తడిసి ముద్దయిపోయాయి. జిల్లా వ్యాప్తంగా సగటు 554.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ తెలిపారు. రాప్తాడు మండలంలో అత్యధికంగా 141.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద నిర్మించిన ప్రహరీ గోడ నీటి ప్రవాహానికి కూలిపోయింది. కదిరి రోడ్ లో ఉన్న లేపాక్షి నగర్ లోకి వరద నీరు ప్రవహించడంతో స్థానికులు ఆందోళన చెందారు.

అధికారులు నీటిని మళ్లించే ప్రయత్నం చేపట్టారు. అనేక సంవత్సరాలుగా చిన్న చిన్న వంకలు పూర్తిగా ఆక్రమించి గృహ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తడకలేరు పై ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల రుద్రంపేట బైపాస్ లో ప్రజాశక్తి నగర్, బీజేపీ కొట్టాలు ఇతర ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించింది. ఆత్మకూరులో 38 మిల్లీమీటర్లు, బ్రహ్మసముద్రం 35, బుక్కరాయసముద్రం 34.2, అనంతపురం రూరల్ 30.2, సెట్టూరు 27.6, పామిడి నార్పల 25.6, అనంతపురం అర్బన్ 24.2, రాయదుర్గం 12.4, కంబదూరు 12.4, గుమ్మగట్ట 10.2, యాడికి 10, పెద్దవడుగూరు 9.2 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. వర్షాల వల్ల మామిడి, బొప్పాయి, ఇతర పంటలకు నష్టం వాటిల్లినప్పటికీ, వేసవి కావడం వల్ల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. రైతులు వేసవి దుక్కులు దున్నుకునే ఏర్పాట్లలో తల మునకలయ్యారు. విత్తన వేరుశనగ కాయ కోసం అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.

Leave a Reply