జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో అట్టడుగు స్థానం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆర్థిక విధ్వంసానికి ఇవే ఆనవాళ్లు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) (KTR) తన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉండటం దారుణమని పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ పాలనలో తెలంగాణ (Telangana) దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక సూచిక ఇదేనని విమర్శించారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దన్నుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని, వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్నిరంగాలు రికార్డులు తిరగ రాశాయని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో మాత్రం పండగొచ్చినా, పబ్బమొచ్చినా కూడా అన్ని రంగాలు నేలచూపులే చూస్తున్నాయని, వ్యవసాయం (agriculture) నుంచి రియల్ ఎస్టేట్ వరకు అన్నిరంగాల్లో దైన్యమే తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని ఆరోపించారు.