కావేరి విశ్వవిద్యాలయంలో.. గవర్నర్
గజ్వేల్, అక్టోబర్ 24 (ఆంధ్ర ప్రభ) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని కావేరి విశ్వవిద్యాలయం మరియు కావేరి సీడ్ కంపెనీని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు జిల్లా కలెక్టర్ కె. హైమావతి, పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ రెండు సంస్థలు తమ తమ రంగాలలో సాధించిన అసాధారణ పురోగతి, విజయాలు, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను యూనివర్సిటీ చాన్స్ లర్ జీ.వి. భాస్కరరావు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.ప్రవీణ్ రావు లు గవర్నర్ కు వివరించారు. వాటిని గవర్నర్ పరిశీలించి యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశోధకులను కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతను మరియు పరిశోధనలను అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంంకు సంబంధించి తీసుకుంటున్న కొత్త నిర్ణయాలను గవర్నర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మొదట కావేరి యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్ ను పరిశీలించారు. తదుపరి ఎంటమాలజీ, పాథాలజీ, సాయిల్ సైన్స్, బ్రీడింగ్ , ఫిజియోలజీ ల్యాబ్స్ ను మరియు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రకాలైన డ్రోన్ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, 3డి ప్రింటింగ్ ఏ.ఆర్ అండ్ వి.ఆర్ మోడల్స్, మరియు అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ ను పరిశీలించారు. తర్వాత గవర్నర్ వర్మి కంపోస్ట్ కార్యక్రమాలను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్లో టిష్యూ కల్చర్, జినోమిక్స్, స్పీడ్ బ్రీడింగ్, ప్లాంట్ హెల్త్ ల్యాబ్స్, జీన్ బ్యాంక్ లను సందర్శించి ఇవి చాలా ఆధునాతనంగా ఉన్నాయని అభినందించారు.
అనంతరం కావేరి యూనివర్సిటీ ఛాన్సలర్ మాట్లాడుతూ.. గవర్నర్ సందర్శన విశ్వవిద్యాలయానికి ఒక గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడేలా విశ్వవిద్యాలయం తీసుకుంటున్న ప్రతిపాదనలు, పథకాలను వివరించారు. అలాగే వైస్ చాన్సలర్ మాట్లాడుతూ.. కావేరి యూనివర్సిటీ పరిశోధనలో కొత్త దారిని చూపించడానికి కట్టుబడి ఉందని, కావేరి సీడ్స్ కంపెనీతో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక మనోబలం కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీవో వి.చంద్రకళ, వర్గల్ తహ సిల్దార్ రఘువీరా రెడ్డి, గజ్వేల్ఏసిపి నరసింహులు, సిఐ మహేందర్ రెడ్డి, కావేరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి. శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్ష పొలసాని, అగ్రికల్చరల్ డీన్ ఏ .ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ కొండా శ్రీనివాస్, ప్రొఫెసర్లు,శాస్త్రవేత్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

